పల్లవి:మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||
1. మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ ||మరణమున్||
2. నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||
3. వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||
4. కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||
5. మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||
6. మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||
7. అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||
